అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని... టీఎన్జీవో కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరిగాయి. రెండు రోజుల పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ పోటీలను... క్రీడా ప్రాధికారక సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి, మహిళ విభాగం ఛైర్ పర్సన్ బండారు రేచల్ ప్రారంభించారు.
క్రీడలే మానసిక ఉల్లాసం...
మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో ఉద్యోగిణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విరోచిత పోరాటాల స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధే లక్ష్యంగా ఈ సంబురాలు జరుపుకున్నట్లు రేచల్ వివరించారు. నాలుగు గోడల మధ్య అనునిత్యం ఒత్తిడితో పని చేసే ఉద్యోగిణులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రతీరోజు వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని ఆమె సూచించారు.