ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో దారుణం జరిగింది. అత్యంత కిరాతకంగా భార్యను నరికి చంపాడు భర్త. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మోగల్లుకు చెందిన కొరకూటి సత్యవతి(65), నాగేశ్వరరావు (70) భార్యాభర్తలు. కొంతకాలంగా నాగేశ్వరరావుకు మతి స్థిమితం లేదు. భార్య రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెపై నాగేశ్వరరావు కత్తితో దాడి చేసి నరికి చంపాడు.
కేకలు విన్న స్థానికులు వేరేచోట ఉంటున్న ఆ దంపతుల కుమారుడికి సమాచారం అందించారు. కుమారుడు, బంధువులు వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి దారుణం జరిగిపోయింది. రక్తపు మడుగులో ఉన్న సత్యవతిని, పక్కనే ఉరి వేసుకొని ఉన్న నాగేశ్వరరావును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగేశ్వరరావు చనిపోగా.. సత్యవతి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు