మహిళలకు సాధికారత కలిగించినప్పుడే అన్ని రంగాల్లో వారు పురుషుల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఆదర్శ్ నగర్లోని బిర్లా సైన్స్ ఆడిటోరియంలో ఉత్సవాలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి, మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ త్రిపురనేని వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను దత్తాత్రేయ సత్కరించారు.
ఆత్మరక్షణ అవసరం
మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని... ప్రతి ఒక్కరూ వారిని గౌరవించాలని దత్తాత్రేయ సూచించారు. ఇటీవల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని... మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు చిన్నప్పటి నుంచే ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి విద్యలు నేర్పించాలని చెప్పారు.
ఇదీ చదవండి: మార్పు కోసం ఓటు వేయండి: కోదండరాం