కోతులు ఊళ్లు వదిలి తిరిగి అడవుల్లోకి వెళ్లాలంటే రాష్ట్రమంతటా ‘వానర వనాలు (మంకీ ఫుడ్ కోర్టులు) ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికార యంత్రాంగం కార్యాచరణ చేపడుతోంది. ఈ సమస్యను హరితహారం ద్వారా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ఏడాది జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన వానర వనాలు ఫలితాలివ్వడం వల్ల ఈ ఏడాది కూడా హరితహారంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఏడాదిలోనే బొప్పాయి, జామ
- వానర వనాల్లో త్వరగా పెరిగే పండ్ల మొక్కలను నాటుతున్నారు. వాటిని దగ్గరదగ్గరగా నాటుతుండటంతో త్వరగా పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఏడాదిలోనే పండ్లు, కాయలు రాగా, మిగిలినచోట్ల రెండు, మూడో ఏడాది నుంచి పండ్లు కాస్తాయని.. కోతులు అక్కడికే వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
- సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో 11 గ్రామాల్లో ఇలాంటి వనాలు ఏర్పాటుచేసి 45 వేల పండ్ల మొక్కలు పెంచారు. ఏడాదిలోనే బొప్పాయి చెట్లకు పండ్లు కాశాయి. జామకాయలు, మునగ, సీతాఫలం, ఉసిరి కాయ దశలో ఉన్నాయి. మానేరు తీరం ఏడెకరాల్లో 14 రకాలు.. 2 వేల పండ్ల చెట్లు పెంచుతున్నారు.
జగిత్యాలలో 100 వనాలు
20 రకాల పండ్ల చెట్లు.. ఐదెకరాల విస్తీర్ణం.. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 100 వానర వనాలు ఏర్పాటయ్యాయి.. ఫెన్సింగ్.. ప్రత్యేకంగా బోర్లు వేశారు. త్వరగా పెరిగే జామ, సీతాఫలం, అల్లనేరేడు, దానిమ్మతో పాటు కోతుల ఆవాసం కోసం చింత, రావి, జువ్వి, మర్రి వంటి చెట్లనూ పెంచారు.కోతులను తరమడానికి జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి మున్సిపాల్టీలలో రూ. ఐదారు లక్షలు ఖర్చుచేసేవారు. కొండగట్టు ఆలయం సమీపంలోని హిమ్మత్రావుపేట సహా కొడిమ్యాల మండలం, మల్యాల మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉండేది. రోజుకు రూ.వేల అద్దె చెల్లిస్తూ కొండముచ్చులను పెట్టినా ఫలితం ఉండేది కాదు. దీంతో తెలంగాణలో మంకీఫుడ్ కోర్టును తొలిసారి జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేశారు.
ఇది మంచి నిర్ణయం..
పండ్ల మొక్కలతో వానర వనాలు ఏర్పాటుతో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని జీవ వైవిధ్య మండలి ప్రొఫెసర్ హంపయ్య పేర్కొన్నారు. ప్రజలు కూడా వీలైనన్ని పండ్ల మొక్కలు పెంచాలని ఆయన సూచించారు.
ఇదీచూడండి: 'బడి తెగింపు' పై రాష్ట్ర బాలలహక్కుల కమిషన్ సుమోటో విచారణ