వర్షకాలం సీజన్లో దోమల వ్యాప్తి నియంత్రణకు ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జీహెచ్ఎంసీ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే లిబర్టి రోడ్లో మేయర్ గేట్ పక్కన దోమల మస్కట్ను ఏర్పాటు చేసింది. నిరంతరం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణించే వ్యక్తులు.. జీహెచ్ఎంసీకి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు దోమల నివారణపై అవగాహన కలిగించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని దోమ మస్కట్లు...
నగరంలోని పలు కూడళ్లలో మరిన్ని దోమ మస్కట్లను ఏర్పాటు చేయాలని బల్దియా యోచిస్తోంది. ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో నిల్వ నీటిని వారానికి ఒకసారైనా శుభ్రపరిచేలా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు. కాలనీలు, మురికివాడల్లో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఎంటమాలజి ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు.
వాటి సంతాన వృద్ధిని బ్రేక్ చేయవచ్చు...
దోమల గుడ్లు, లార్వాలను నశింపచేయడం ద్వారా దోమల సంతాన వృద్ధిని బ్రేక్ చేయవచ్చని ఎంటామాలజీ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. నిల్వ ఉన్న నీటిలో పెరుగుతున్న లార్వాలను తొలగించి, నీటి నిల్వ ట్యాంక్లు, డ్రమ్లు, పరికరాలను శుభ్రపరిచి కొంత సేపు ఎండనివ్వాలని సూచిస్తున్నారు.
యాంటీ లార్వా స్ప్రేయింగ్ పనులు ముమ్మరం
ఒకవైపు దోమల సంతాన వృద్ధిని అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు యాంటీ లార్వా స్ప్రేయింగ్ పనులను ఎంటమాలజి విభాగం ముమ్మరం చేసింది. ప్రస్తుతం యాంటి లార్వా ఆపరేషన్లకు నగరంలో మూడు డ్రోన్లను వినియోగిస్తున్నారు. మరో 15 రోజుల్లో డ్రోన్ల సంఖ్యను 11కు పెంచనున్నారు.
వారానికోసారి తప్పనిసరి ఫాగింగ్...
అలాగే పైలెట్ పద్ధతిలో 74 ఫాగింగ్ మిషన్లను జీపీఎస్కు లింక్ చేసి వాటి పనితీరును జీహెచ్ఎంసీ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ 74 ఫాగింగ్ మిషన్లు వారానికి ఒకసారి తప్పనిసరిగా నగరంలోని 9 వేల 500 కిలోమీటర్లను కవర్ చేస్తూ ఫాగింగ్ చేయాలని నిబంధన విధించారు.
7 ప్రదేశాల్లో మస్కిటో ట్రాప్ మిషన్లు...
రోజువారీగా ఈ మిషన్లు నిర్వహిస్తున్న ఫాగింగ్ను జియో ట్రాకింగ్ ద్వారా ఆటోమెటిక్గా అధికారుల డ్యాష్ బోర్డుతో పాటు మొబైళ్లలోనూ కనబడనుంది. రెగ్యులర్గా ఫాగింగ్ నిర్వహించేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి. డెంగ్యు, మలేరియా, చికెన్గున్యా తదితర కీటక జనిత వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై యాంటి లార్వా ఆపరేషన్లను ముమ్మరం చేశారు. అటువంటి 7 ప్రదేశాల్లో మస్కిటో ట్రాప్ మిషన్లను, మూసి ప్రాంతంలో మరో 7 చోట్ల మస్కిటో కిల్లింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి : సుప్రీం తీర్పు తర్వాతే డిగ్రీ, ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ!