హైదరాబాద్లో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న భవనాల కూల్చివేతలు కొనసాగుతున్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. శేరిలింగంపల్లి జోన్లో నాలుగు రోజుల్లో 30 భవనాలకు చెందిన 140 స్లాబ్లను కూల్చివేసినట్లు వెల్లడించారు. అయ్యప్ప సొసైటీలో 29 నిర్మాణాలను కూల్చివేశామన్నారు.
అనుమతులకు మించి నిర్మించిన అంతస్తులను, ఎక్కువ విస్తీర్ణంలోని నిర్మాణాలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కడుతున్న భవనాలను కూల్చివేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. బల్దియా అనుమతులు లేకుండా నిర్మించిన ప్లాట్లను కొనుగోలు చేయొద్దని.. ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కలిగిన ప్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
ఈ సర్టిఫికెట్లు పొందని భవనాలకు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్లులు పెనాల్టీగా ఉంటాయన్నారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో నిర్మాణ అనుమతులతో పాటు ఆక్యుపెన్సి సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన వివరాలు ఉంటాయని వాటిని చూసి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.