Contract frauds in Hyderabad : మంత్రి వ్యక్తిగత సిబ్బందిమంటూ నమ్మించి సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఉత్పత్తుల కాంట్రాక్టు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్టారు. ఏకంగా రూ.17 లక్షల 65 వేలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సమగ్ర శిక్షా అభియాన్ పతకం కింద స్కూల్ షూస్ (బూట్లు), బ్యాగులు, సాక్సులు (మేజోళ్లు) విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. వీటిని సరఫరా చేసేందుకు హరియాణా రాష్ట్రం కర్నాల్లోని ఆల్ఫా ఇంటర్నేషనల్ సిటీకి చెందిన లిబర్టీ షూస్ సంస్థ ప్రతినిధులు విద్యాశాఖ మంత్రికి దరఖాస్తు చేసుకున్నారు.
మంత్రి సిబ్బందిమంటూ నమ్మించి : అనంతరం జీకే కుమార్, బెల్లి తేజ, ఆంజనేయులు, రమేష్రెడ్డి అనే వ్యక్తులు లిబర్టీ షూస్ కంపెనీ నిర్వాహకులను సంప్రదించారు. మంత్రి సబితాఇంద్రా రెడ్డికి వారు జీకే కుమార్ మంత్రి వ్యక్తిగత సహాయకుడిగా, తేజ రెండో వ్యక్తిగత సహాయకుడిగా, ఆంజనేయులు రాజకీయ కార్యదర్శిగా, రమేష్రెడ్డి పీఆర్వోగా పరిచయం చేసుకున్నారు. బూట్ల సరఫరా కాంట్రాక్టు తమకే ఇప్పిస్తామని నమ్మించారు. ఇందుకు రూ.17,65,000 అడ్మినిస్ట్రేటివ్, ఇతర ఛార్జీల నిమిత్తం చెల్లించాలని నమ్మించారు.
పలు దఫాలుగా డబ్బులు : జీకే కుమార్, బెల్లి తేజ, ఆంజనేయులు సూచన మేరకు కంపెనీ ప్రతినిధులు. 2019 డిసెంబరు 12న రూ. 4.50 లక్షలు ప్రవీణ్ వర్మ పేరుతో ఉన్న ఖాతాకు పంపిచారు. డిసెంబరు 23న బెల్లితేజ ఖాతాకు రూ. 50 వేలు, 2020 ఫిబ్రవరి 20న రూ.2.25 లక్షలు ఆర్టీజీఎస్ చేశారు. స్వాతి పేరుతో ఉన్న ఖాతాకు రూ. లక్ష, విక్రమ్ పురి ఖాతాలో రూ.2 లక్షలు జమ చేశారు. అనంతరం జీకే కుమార్ వారి నుంచి రూ.7.4 లక్షలు తీసుకున్నారు.
ఇప్పటి వరకు కాంట్రాక్టు రాకపోవడంతో తీసుకున్న మొత్తాన్ని ఇవ్వాలని లిబర్టీ షూస్ ప్రతినిధులు కోరారు. ఆంజనేయులు తప్పుడు ఇన్వాయిస్లు తయారు చేసి వాట్సప్ ద్వారా పంపి నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన కంపెనీ వారు ఈ వ్యవహారంపై లిబర్టీ షూస్ ప్రతినిధి కమల్ ధావన్ బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏడుగురిపై ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీకే కుమార్ గతంలో మంత్రి వద్ద సహాయకుడిగా పనిచేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: