మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని పలువురు పర్యావరణ ప్రేమికులు సూచించారు. హైదరాబాద్ నాంపల్లి ఫ్యాప్సీ భవన్లో రైతునేస్తం పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈనాడు దినపత్రిక ఏపీ ఎడిషన్ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ విశ్రాంత సంచాలకులు డాక్టర్. రావి చంద్రశేఖర్, ఏపీ గనుల శాఖ పూర్వ సలహాదారుడు డీఎల్ఆర్ ప్రసాద్, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఎస్బీఐ మేనేజర్ జె.శ్రావణి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఉద్యాన నిపుణులు బోడెంపూడి శ్రీదేవి రచించిన 'పచ్చని లోగిలి' పుస్తకాన్ని ఎంఎన్ఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తొలి కాపీని రచయిత శ్రీదేవి తల్లి రోజా పుష్పలీలావతికి అందజేశారు. గృహిణులు, యువత, ఉద్యాన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం తీసుకొచ్చామని రచయిత శ్రీదేవి వెల్లడించారు.
అభినందనీయం..
అలంకరణ మొక్కలపై ఈనాడు వసుంధర పేజీలో తాను రాసిన వ్యాసాల ద్వారా ఎంతో మంది అభిమానం పొందిన శ్రీదేవి.. మూడేళ్లపాటు రాసిన రచనల సమాహారం "పచ్చని లోగిలి" రూపంలో తీసుకురావడం అభినందనీయమని నిపుణులు తెలిపారు. ఈ పుస్తకం ఇంటింటికీ చేరాలని ఎం.నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఒక్క పుస్తకం ద్వారానే కాక ఆడియో, వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళితే ప్రకృతి ప్రేమికులు, మహిళలు ఆదరిస్తారని ఆయన సూచించారు.
అందరి చెంతకు చేరాలి..
కరోనా నేపథ్యంలో అందరిలోనూ పర్యావరణ స్పృహ పెరిగిన నేపథ్యంలో ఈ పుస్తకం అందరి చెంతకు చేరాల్సిన అవసరం ఉందని యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.