జంటనగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. కొండాపూర్లోని ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ కరోనా బారిన పడగా, ..వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ పరీక్షలు చేయగా మరో నలుగురికి కరోనా నిర్థారణ జరిగింది. సాప్ట్వేర్ ఉద్యోగి భార్య, మూడేళ్ల కుమారుడు, బావమరిది, అతని మూడున్నరేళ్ల కూతురుకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో వైపు కుత్బుల్లాపూర్ గాజులరామారం బాలాజీ లేఔట్లో గర్భిణీకి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనాగా తేలింది.
13 మందికి కరోనా లక్షణాలు...
నగర శివారు జల్పల్లి మున్సిపాలిటీలోని పహాడీషరీఫ్, హర్షగూడలో ఉండే ముగ్గురు మాంసం వ్యాపారుల ఇళ్లలో మొత్తం 13 మందికి కరోనా లక్షణాలు ఉండటం వల్ల ఆస్పత్రికి తరలించారు. వీరికి జియగూడలో ఉండే వారి బంధువుల ద్వారా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కరోనా లక్షణాలతో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి బంజారాహిల్స్ నుంచి నలుగురు, అమీర్పేట నుంచి ముగ్గురు వచ్చారు. వీరి వైద్య పరీక్షల నివేదిక రావాల్సి ఉంది. నిన్న 12 మందికి నిర్వహించిన పరీక్షల్లో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఫీవర్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.
మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్...
ఇప్పటివరకు అంబర్పేట నియోజకవర్గం పరిధిలో 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 16 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అధికారులు13 కంటైన్మెంట్ జోన్లును ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ వసంతపురి కాలనీకి చెందిన ఓ మహిళ గత కొంత కాలంగా దగ్గు ,జలుబుతో బాధపడుతుంది. ఆమెను ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రికి తీసుకవెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు మంగళవారం పాజిటివ్గా నిర్ధారించారు. మహిళ నివాసముంటున్న అపార్ట్మెంట్ను కంటైన్మెంట్ జోనుగా ప్రకటించారు. కరోనా బారిన పడుతున్న పోలీస్ సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతోంది. కామటిపుర, బహదూర్ పుర పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.