అందానికి మెరుగులు దిద్దుకునే బ్యూటీ స్పాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. లాక్డౌన తర్వాత బ్యూటీ స్పాలు పునః ప్రారంభం అయినప్పటికీ.. అనుకున్నంత స్పందన రాకపోవడం వల్ల నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
లాక్ డౌన్కు ముందు రోజుకు లక్షల్లో జరిగే వ్యాపారం లాక్ డౌన్ తర్వాత కనీసం రూ. వెయ్యి కూడా దాటట్లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లు, పేరంటాలు వేడుకల సమయంలో రోజుకు ఎంతో మంది కస్టమర్లు తమ సేవలు వినియోగించుకునే వారని.. ఇప్పుడు ఈ వేడుకలు తక్కువ స్థాయిలో జరగడం వల్ల ఇటువైపు చూసే వారే కరవయ్యారని వాపోతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అద్దె చెల్లింపులు కూడా కష్టంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వినియోగదారులు రావడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. వినియోగదారుల భయాందోళనలు పోయేంతవరకు బ్యూటీ స్పాల వ్యాపారం పుంజుకునే అవకాశం లేదన్నారు. లాక్ డౌన్ సమయంలో పూర్తిగా మూసివేయడం కారణంగా రెంట్లు, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.
లాక్ డౌన్ తర్వాత కస్టమర్ల కోసం ఎలాంటి సర్వీసులు చేయాలనే విషయాలపై ఎంతో ఆత్రుతతో ఎదురు చూశామని.. అయితే ఇప్పుడు తాము అనుకున్న దానికి పూర్తిగా భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితులు కొనసాగితే అద్దె, ఉద్యోగుల జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితులు ఉత్పన్నమై.. మరింతగా వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉందని వాపోయారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్