నగరంలో మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన షీ-బృందాలకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వేధింపులకు గురిచేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వేధిస్తున్న ఆకతాయిల కోసం డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వేధిస్తున్న వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని మొదట వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపుతున్నారు. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా గృహ హింస, ఫోన్ కాల్ వేధింపులు, వాట్సాప్ వేధింపులు, అశ్లీల వీడియోలు పంపుతున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. సెప్టెంబర్ నెలలో బాధితుల నుంచి 182 ఫిర్యాదులు అందాయి.
సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని..
మియపూర్కి చెందిన ఓ మహిళకు రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. సినిమా పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని ఆమె నుంచి విడతల వారిగా కొంత నగదు వసూలు చేశాడు. అవకాశాలు ఇప్పించకపోగా.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె షీ-టీమ్స్ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో కేసులో జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ను పదిహేనేళ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టు చేశారు.
మూడేళ్లు సహజీవనం చేసి..
మరొక కేసులో కూకట్పల్లికి చెందిన వినోద్కుమార్ ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్ల పాటు సహజీవనం చేశాడు. అనంతరం ముఖం చాటేయడంతో బాధితురాలు వాట్సాప్ ద్వారా షీ టీమ్స్కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇలా ఫిర్యాదు చేయొచ్చు..
వేధింపుల బారిన పడేవారు పోలీసులకు ఫిర్యాదులు చేయాలని.. తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని సైబరాబాద్ షీ-టీమ్స్ డీసీపీ అనసూయ తెలిపారు. వేధింపుల బారిన పడే బాధితులు డయల్ 100, 949061744 నెంబర్కు వాట్సాప్కి కానీ, sheteam.cyberabad@gmail.com ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: జడ్జిలపై వ్యాఖ్యల కేసులో మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ