జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికుల నుంచి కమిషనర్ వరకు అధికారులు, సిబ్బందికి 100 శాతం కరోనా వాక్సిన్ ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ నిర్వహణపై జోనల్ కమిషనర్లతో కమిషనర్ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 15లోగా బల్దియా సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
తక్షణం సంబంధిత అర్బన్ హెల్త్ సెంటర్లలో వాక్షినేషన్ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ప్రతిరోజూ వాక్సిన్ వేసుకున్న వారి వివరాలు ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. వాక్సినేషన్ వివరాలు కొవిడ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. అన్ని స్థాయిలోనూ దాదాపు 30 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారని.. కరోనా కట్టడిలో భాగంగా 15 తర్వాత ప్రతిఒక్క అధికారి, సిబ్బంది విధిగా వాక్సిన్ వేసుకొనే కార్యాలయానికి రావాలన్నారు.
ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు.
ఇదీ చూడండి: 'గాంధీలో కరోనా చికిత్సతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథం'