రైతుకు గిట్టుబాటు ధరే లక్ష్యంగా వర్షాకాలం నుంచి నియంత్రిత విధానంలో పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు నివేదించిన అంశాల ఆధారంగా రాష్ట్రంలో నియంత్రిత విధానంలో పంటల సాగు, వాటి విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. వర్షాకాలంలో మొక్కజొన్న పంట వేయవద్దన్న ప్రభుత్వం... 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖరారు కాగా జిల్లాలవారీగా పంటల సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేసే కసరత్తు సాగుతోంది.
స్వాగతిస్తున్న రైతులు
గత రెండు రోజులుగా ఇందుకు సంబంధించి సమావేశాలు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నియంత్రిత సాగు విధానాన్ని రైతులు స్వాగతిస్తున్నారన్న అధికారులు, అధ్యక్షులు... కొన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నూనెగింజలు, చిరుధాన్యాలు, పచ్చరొట్ట సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు. కూలీల కొరత సమస్య ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికే కూలీల సమస్య ఉందని పత్తి సాగు విస్తీర్ణం పెరిగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని వారు తెలిపారు. అన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు.
మ్యాప్ ఆధారంగా పంటల కేటాయింపు..
జిల్లాల వారీ పంటల సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులతో మధ్యాహ్నం సమావేశమై ఈ అంశాలను విస్తృతంగా చర్చించనున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని జిల్లాల మ్యాప్ల ఆధారంగా ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించి నియంత్రిత సాగు విధానాన్ని ఖరారు చేస్తారు.
ఇదీ చూడండి : పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రైబ్యునల్ స్టే