రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్న తరుణంలో.. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆక్షేపించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్లో ధాన్యం సేకరణకు సంబంధించి ఐటీ, విజిలెన్స్ అధికారులతో ఆయన సమీక్షించారు. యాసంగి మార్కెటింగ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల తీరు, లోపాలు, ఎదురవుతోన్న ఇబ్బందులు, నగదు చెల్లింపుల్లో ఆలస్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఇప్పటికే 77 శాతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని.. మిగతా ధాన్యం నిర్ణీత గడువులోగా కొనుగోలు చేస్తామని శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సుమారు 9 లక్షల మంది రైతులకు రూ.11,500 కోట్ల చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. బ్యాంకుల్లో ఉత్పన్నమవుతోన్న సాంకేతిక లోపాల వల్ల రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడంలో కాస్త ఆలస్యమవుతుందే తప్ప మరో సమస్య లేదని చెప్పారు.
చివరి గింజ వరకూ కొంటాం..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మారెడ్డి స్పష్టం చేశారు. ఇది ఓర్వలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. రైతాంగం ఆందోళన చెందొద్దని అన్నారు. దళారీలకు అమ్ముకుని నష్టపోవద్దని సూచించారు.