భారీ వర్షాలు,వరదల కారణంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్... కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. తక్షణం రూ.2,250 కోట్ల ఆర్థిక సాయంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా సహా 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. వరి, మొక్కజోన్న, పత్తి , చెరకుతో పాటు కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు నీట మునిగి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
భారీ వర్షాలకు కృష్ణా నదికి వరదలు రావటంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో వాగుల కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయిందని స్పష్టం చేశారు. వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం 4,450 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేసినా...14 మంది మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు తిరిగి తీసుకువచ్చేందుకు ముందస్తుగా వెయ్యి కోట్లు మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు.