ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్పై కరోనా ప్రభావం పడింది. రోజూ 33 లక్షల మంది ప్రయాణికులతో రూ.3.50 కోట్ల ఆదాయంతో నడిచే ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ నేడు 17 లక్షల ప్రయాణికులతో రూ.2.60 కోట్ల ఆదాయానికి పరిమితమైంది. బస్సు పాస్ల విషయానికి వస్తే.. దాదాపు 2.13 లక్షలు గాయబ్ అయ్యాయి. వాటిని రాబట్టుకునే పనిలో గ్రేటర్ జోన్ నిమగ్నమైంది. అందుకే ఇంటికే బస్సు పాస్ పథకాన్ని ప్రవేశ పెట్టింది.
మీరు నివాసముంటున్న కాలనీ, పని చేస్తున్న కార్యాలయం ఎక్కడైనా.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి మీరు ముందుకొస్తే.. నేరుగా మీ వద్దకు వచ్చి బస్సు పాస్ ఇస్తామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 5 అంతకంటే ఎక్కువ మంది ఉంటే మీ వద్దకు వచ్చి బస్సు పాస్ అందజేస్తామంటున్నారు. ఇందుకు మీరు చేయాల్సిందంతా ఒక్కటే.. 80082 04216 నంబరుకు ఫోను చేసి చిరునామా చెబితే చాలు. ఈ సేవలు కొనసాగిస్తూనే.. నగరంలో రేతిఫైల్, కోఠి, దిల్సుఖ్నగర్.. ఇలా మొత్తం 31 కేంద్రాల్లో ఆర్టీసీ అన్ని రకాల బస్సు పాస్లు జారీ చేస్తున్నారు.
లాక్డౌన్ తర్వాత రోజుకు 10 వేలతో మొదలైన సిటీ బస్సుల ప్రయాణికులు ఇప్పుడు 17 లక్షలకు చేరారని వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రస్తుతం రద్దీ మార్గాల్లో బస్సులు పెంచుతున్నామని అన్నారు. మళ్లీ ప్రయాణికుల ఆదరణ చూరగొంటామన్నారు.
ఇదీ చదవండి: రోగ నిరోధక శక్తిలో నీరే కీలకం