Awards to Telangana: దేశంలో అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తున్న తెలంగాణ అనేక అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రతి ఏటా అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు గెలుచుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మరోసారి అవార్డుల పంట పండింది. ప్రతి ఏటా ఇచ్చే అవార్డులతో భాగంగా ఈ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... ఈ మేరకు రాష్ట్రానికి లేఖను పంపింది. ఈసారి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరిలలో 19 అవార్డులు తెలంగాణ సాధించింది. నాలుగు కేటగిరీల్లో రాష్ట్రానికి 19 ఉత్తమ అవార్డులు వచ్చాయి.
రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, అభివృద్ధి విజన్ కారణంగానే ఈ అవార్డులు దక్కాయని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాల వల్లనే మన పల్లెలు ఆదర్శంగా మారాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ది పనులు చేపడుతూనే... నిరంతరం పారిశుద్ధ్య పనులు చేయడం వల్లే ఇలాంటి అభినందనలు వస్తున్నాయన్నారు. ఈ అవార్డులు రావడానికి కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, ప్రజలకు అభినందనలు తెలిపిన మంత్రి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
అవార్డులు వచ్చిన జిల్లాలు, మండలాలు
- ఉత్తమ జిల్లా పరిషత్గా సిరిసిల్ల ఎంపికైంది.
- ఉత్తమ మండలాలుగా వరంగల్ జిల్లా పర్వతగిరి, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలాలు ఎంపిక అయ్యాయి.
- ఉత్తమ అభివృద్ధి ప్రణాళికా గ్రామ పంచాయతీగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామం ఎంపికైంది.
- ఉత్తమ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామం ఎంపికైంది.
- ఉత్తమ నానాజీ దేశ్ముఖ్ గౌరవ్ గ్రామసభగా నారాయణ పేట జిల్లా మంతాన్ గడ్ గ్రామం ఎంపికైంది.
- దీన్ దయాళ్ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్ర కే, కరీంనగర్ జిల్లా వెల్జాల, మహబూబాబాద్ జిల్లా వెంకటా పూర్, సిద్దిపేట జిల్లా జక్కా పూర్, బూరుగుపల్లి, మహబూబ్ నగర్ జిల్లా గుండ్ల పోట్లపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట, మండేపల్లి, వరంగల్ జిల్లా మరియపురం, పెద్దపల్లి జిల్లా నాగారం, హరిపురం గ్రామాలు ఎంపికయ్యాయి.
ఇదీ చదవండి: తెరాసలో బహిర్గతమైన వర్గ విభేదాలు.. అధికారుల తీరుపై విమర్శలు