కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ మహమ్మారి వైరస్ను కట్టడి చేయలేక అభివృద్ధి చెందిన దేశాలు సైతం చేతులేత్తేస్తున్నాయి. అయితే సాంకేతిక సాయంతో దీని వ్యాప్తిని అరికట్టవచ్చని అంటున్నారు విజయవాడకు చెందిన చైతన్య అనే యువకుడు. కరోనా నియంత్రణకు ఓ సాఫ్ట్వేర్ను రూపొందించాడు. ప్రజలు, ప్రభుత్వాలు వినియోగించుకునేలా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చాడు చైతన్య. ఈ సాఫ్ట్వేర్ ప్రయోజనాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కరోనా సోకిన వారి గుర్తింపు, కట్టడి, నియంత్రణ ఇతర అదనపు సేవల కోసం వినియోగిస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
చైతన్య రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ఏయే ప్రాంతంలో ఎంతమంది కరోనా బాధితులు ఉన్నారో ప్రజలు తెలుసుకోవచ్చు. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు ఇందులో ప్రభుత్వం వివరాలను నమోదు చేయవచ్చు. అలాగే కరోనా సోకిన వారు సైతం స్వతహాగా తమ వివరాలను ఇందులో నమోదు చేసుకోవచ్చు. కరోనా బాధితుల వ్యక్తిగత గోప్యతకు దీని ద్వారా ఎలాంటి భంగం వాటిల్లదు. అలాగే చుట్టు పక్కల ఏ ప్రాంతంలో క్వారంటైన్ కేంద్రాలు, చికిత్స కేంద్రాలు, రెడ్జోన్ ప్రాంతాలు ఉన్నాయో ప్రజలు తెలుసుకోవచ్చు. వైరస్ బాధితులు ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా సామాజిక దూరం పాటించడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. అలాగే ప్రభుత్వాలు కూడా ఏ ప్రాంతంలో కరోనా విజృంభిస్తుందో గుర్తించి సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడుతుంది.
ఎబోలా సమయంలో రూపకల్పన..
2015వ సంవత్సరంలో ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా కబళించింది. ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు 50శాతం పైగా మరణాలు సంభవించాయి. అయితే అదృష్టవశాత్తు ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేయగలిగారు. ఆ సమయంలో తాను పనిచేస్తున్న ఓ ఐటీ సంస్థ ద్వారా విజయవాడకు చెందిన చైతన్య 'ఉషహిది' అనే ఉచిత సాఫ్ట్వేర్ సాయంతో ఓ సాంకేతికతను అభివృద్ధి చేశారు. తాజాగా దీనికి మరింత మెరుగులు దిద్ది కరోనా నియంత్రణకు ఉపయోగిస్తున్నారు. కరోనా కట్టడికి వివిధ స్థాయిల్లో వైద్యులు, ప్రభుత్వాలు, పారిశుద్ధ్యసిబ్బంది, మీడియా, పోలీసులు ఇలా వివిధ రంగాల వారు పడుతున్న కష్టం చూసి సమాజానికి తనవంతు సాయంగా దీనిని ప్రతిపాదించినట్లు చైతన్య చెప్తున్నాడు.
ఇదీ చూడండి: కరోనా చికిత్స కోసం రూ. 370 కోట్లు విడుదల