హైదరాబాద్ మహా నగర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. జీహెచ్ఎంసీ కొత్తచట్టం వచ్చాక రాజధానిలో డివిజన్ల సంఖ్యను పెంచాలని యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. కనీసం ప్రతి 50 వేల మంది జనాలకు ఓ డివిజన్ ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం 150 డివిజన్ల పరిధిలో దాదాపు కోటి మంది జనాభా ఉండటం గమనార్హం. ఆ లెక్కన డివిజన్లు 180 నుంచి 200కు పెరిగే అవకాశముంది. నవంబరు వరకు ఈ ప్రక్రియను ముగించి, వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలనేది ప్రణాళిక.
ఇప్పటిదాకా జరిగిందేమిటంటే
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ 2007లో ఆవిర్భవించింది. చుట్టూ ఉన్న 12 పురపాలక సంస్థల విలీనంతో మహానగరంగా అవతరించింది. 2009లో 150 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. పాలక మండలి గడువు 2014లో ముగిసింది. అప్పటికే గ్రేటర్లో డివిజన్లను పెంచాలని పలువురు కోర్టును ఆశ్రయించారు. 2001 జనాభా లెక్కలతో 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని, 2011 లెక్కల ప్రకారం గ్రేటర్లో 67 లక్షల మందికి 172 డివిజన్లు ఉండాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ బాధ్యతను సర్కారు బల్దియాకు అప్పగించింది. సగటున 40 వేల మంది జనాభా ప్రాతిపదికన 172 డివిజన్లు అవసరమవుతాయని బల్దియా కమిషనర్... ప్రభుత్వానికి తెలిపారు.
పునర్విభజన తర్వాతే ఎన్నికలు
సర్కారు.. డివిజన్లను పెంచకుండాసగటున ఒక్కో డివిజన్లో 40 వేల మంది జనాభా ఉండేటట్లు చూసింది. కొత్త సరిహద్దులను నిర్ణయించింది. 2016 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరిలో పాలక మండలి ఏర్పాటైంది. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి, 2021తో పూర్తవనుంది. అప్పటికి ఆరు నెలల ముందే కొత్త జీహెచ్ఎంసీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి అనంతరం ప్రతి 50 వేల మందికి ఒకటి చొప్పున డివిజన్ల పునర్విభజన చేపట్టాలని యంత్రాంగం యోచిస్తోంది. నవంబరు వరకు ఆ ప్రక్రియను ముగించి.. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
2021 జనాభా లెక్కలు 2024లో అందుబాటులోకి వస్తాయని అందువల్ల 2011 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్ల పునర్విభజన జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చూడండి: నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్