ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణనూ కలవర పెడుతోంది. రాష్ట్రంలో ఇవాళ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 75 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరింది.
వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో ఇవాళ 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కు చేరుకొంది. కరోనా కారణంగా ఇవాళ ఇద్దరు మరణించారు. షాద్నగర్కు చెందిన ఒకరు, సికింద్రాబాద్ చెందిన మరొకరు మృతి చెందారు. మరణించిన ఇరువురిని కలిసిన వారందరినీ గుర్తిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇవాళ పాజిటివ్ వచ్చిన వారందరూ కూడా మర్కజ్ కు వెళ్లివచ్చిన వారు, వారి కుటుంబసభ్యులు, సన్నిహతంగా ఉన్నవారేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
దిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. దిల్లీ వెళ్లి వచ్చిన వారిని, వారిలో లక్షణాలున్న వారి కుటుంబసభ్యులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి కరోనా పరీక్షలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆరు పరీక్ష కేంద్రాల్లో 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.