రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఇవాళ కొలువు దీరనుంది. ఆదివారం వరకూ 9 మంది మాత్రమే ఖరారు కాగా అనూహ్యంగా సోమవారం మల్లారెడ్డి పేరు జాబితాలో చేరింది. గత మంత్రివర్గంలోని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేటీఆర్, హరీశ్రావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు వివిధ సమీకరణాల కారణంగా ఈసారి చోటు దక్కలేదు. మంత్రుల ఎంపిక విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే ఫోన్ ద్వారా తెలియజేశారు.
ఆరుగురు కొత్తవారే
విస్తరణలో చోటు పొందిన ఆరుగురు మంత్రి పదవులకు కొత్త. వారిలో సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (వనపర్తి నియోజకవర్గం), వి.శ్రీనివాస్గౌడ్ (మహబూబ్నగర్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), ప్రశాంత్రెడ్డి (బాల్కొండ), ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్) ఉన్నారు. గత మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్ (హుజూరాబాద్), జగదీశ్రెడ్డి (సూర్యాపేట), ఇంద్రకరణ్రెడ్డి (నిర్మల్), తలసాని శ్రీనివాస్యాదవ్ (సనత్నగర్)లకు రెండోసారిఅవకాశం దక్కుతోంది.
సాన్నిహిత్యం
జాబితాలో చోటు పొందిన వారిలో జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డిలు సీఎంకు సన్నిహితులు. ఈటల రాజేందర్ ఉద్యమ సహచరుడు. శ్రీనివాస్గౌడ్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎర్రబెల్లి, తలసాని, మల్లారెడ్డిలు 2014లో తెదేపా నుంచి గెలిచి తర్వాత తెరాసలో చేరారు. ఇంద్రకరణ్రెడ్డి అప్పట్లో బీఎస్పీ తరఫున గెలిచి తెరాసలో చేరారు.
అనుభవానికి పెద్దపీట
సీఎం కేసీఆర్ విస్తరణలో అనుభవానికి పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. ఎర్రబెల్లి దయాకర్రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇంద్రకరణ్రెడ్డి రెండుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మల్లారెడ్డి గత లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఈసారి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. నిరంజన్రెడ్డి ఒక్కరే మొదటిసారి గెలిచినవారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)