అటవీశాఖపై సమర శంఖారావానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునివ్వగా ప్రజా ప్రతినిధులు, పోడు రైతులు స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెంలో మణుగూరు, ఆళ్లపల్లి జడ్పీటీసీలు, పినపాక ఎంపీపీ పోడు భూముల ప్రాంతాల్లో పర్యటించారు. శంభుని గూడెంలో కందకం పనులకు వచ్చిన అటవీ శాఖ, పోలీసు అధికారులు, ఆదివాసీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యే పిలుపుతో కదిలారు :
'ఆదివాసీలారా పోడు భూములకు నడుం బిగించండి' అన్న రేగా కాంతారావు నినాదంతో గిరిజనులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 2005 సంవత్సరానికి కంటే ముందు ఉన్న భూముల జోలికి వెళ్లవద్దని చెప్పినా.. అటవీశాఖ అధికారులు హరితహారం పేరిట భూముల లాక్కుంటున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. పోడు రైతులకు అండగా ఉంటామన్న అటవీశాఖ అధికారులు విభజించు-పాలించు అన్న రీతిలో వ్యవహరిస్తూ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో కోల్పోయిన భూముల కోసమే :
మరోవైపు పోలవరం ప్రాజెక్టుతో కోల్పోయిన లక్షలాది ఎకరాల అటవీ విస్తీర్ణం కోసం ఆదివాసీల భూములను దౌర్జన్యంగా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అటవీశాఖ అధికారులు క్షీణించిన అడవులను మాత్రమే తీసుకుంటున్నామని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సాగుచేసుకుంటున్న పోడు రైతుల భూములపై దౌర్జన్యాలు చేస్తూ గ్రామస్తులపై దుర్భాషలాడుతున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.