పులుసు బొంత ప్రాజెక్టు నిర్మించి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో రూ. 12 కోట్లతో నిర్మించే రహదారి, వంతెనల పనులకు భూమి పూజ చేసి, శిలాఫలకాల్ని ఆవిష్కరించారు.
ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం
పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని పువ్వాడ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుందని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి జిల్లాలోని 7 లక్షల 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు.
రైతును రాజుగా
ఎగువ ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తాగు, సాగునీటి ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతును రాజుగా నిలిపేందుకు కేసీఆర్ విశిష్ట కృషి చేస్తున్నారని కొనియాడారు.
గిరిజన నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యగా ఉన్న పోడు భూములకు పట్టాలు పంపిణీ అంశాన్ని సీఎం పరిష్కరిస్తారని తెలిపారు. ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం అన్ని విధాలా అభివృద్ధి జరిగేలా పనిచేస్తామని పువ్వాడ ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: 'ప్రతి శనివారం చేనేత వస్త్రాలు ధరించాలని నిర్ణయం'