ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంశి కే గ్రామ శివారులో కలకలం సృష్టించిన పులి కదలికల దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. వారం రోజుల వ్యవధిలో అంతర్గావ్, కరంజీ అటవీ శివారు ప్రాంతంలో రెండు పశువులను హతమార్చింది. దాని అడుగులు కనిపించినా.. ఆనవాళ్లు కెమెరాలకు చిక్కలేదు.
తాజాగా మంగళవారం తాంశి శివారులో మరో రెండు పశువులను హతమార్చిగా... ఆ పులి కదలికలను పసికట్టడానికి అటవీ అధికారులు మరో ప్రయత్నం చేశారు. దాడి జరిగిన పరిసరాల్లో కెమెరాలు బిగించగా.. ఆవు కళేబరం తిన్న దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. పులి కదలికలు నిర్ధరణ కావడం వల్ల స్థానికులు మరింతగా ఆందోళన చెందుతున్నారు.
ఈ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వేర్ అభయారణ్యం నుంచి వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పెన్ గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల అటు వైపు వెళ్లకపోవచ్చని చెబుతున్న అధికారులు... పరిసర ప్రాంతాల ప్రజలు అడవి వైపు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా 36 మంది తహసీల్దార్లు బదిలీ