సాహస క్రీడలకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు సమీపంలోని గాయత్రి జలపాతం వేదికైంది. డిసెంబర్లో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించనున్నట్లు తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపకులు రంగారావు పేర్కొన్నారు. జాతీయస్థాయి సాహస క్రీడలు నిర్వహించేందుకుగాను ముందస్తుగా గాయత్రి జలపాతంలో ఈ సన్నాహక క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం 20 మంది సాహసికులు సన్నాహక పోటీల్లో పాల్గొన్నారు. కడప, కర్నూల్, హైదరాబాద్, మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు పోటీపడ్డారు. జలపాతం వద్ద వాటర్ రాఫెల్లింగ్, ట్రెక్కింగ్తో పాటు కడెం నదిలో రాఫ్టింగ్ చేశారు. ఈ సందర్భంగా సాహస క్రీడలు తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఎత్తైన రాతి శిలలపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహ ధారల మీదుగా సాహస క్రీడలను చేపట్టారు. గాయత్రి జలపాతానికి సరైన రోడ్డు మార్గాన్ని వేయిస్తే బాగుంటుందన్నారు. పర్యటకంగా సాహస క్రీడలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని క్లబ్ వ్యవస్థాపకులు రంగారావు తెలిపారు.
ఇదీ చూడండి : తల్లైన పెంపుడు కుక్క... పురుడు పోసిన యజమాని