Surajit Sengupta Footballer: ఫుట్బాల్ దిగ్గజం, భారత మాజీ ఆటగాడు సురజిత్ సేన్గుప్తా (71) గురువారం కన్నుమూశారు. కొవిడ్ బారిన పడిన ఆయన కోల్కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత జట్టుకు సురజిత్ మిడ్ ఫీల్డర్గా సేవలు అందించారు.
సురజిత్ మృతిపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. "ఓ స్టార్ ఫుట్బాలర్ను ఈరోజు కోల్పోయాం. ఫుట్బాల్ అభిమానులు ఆరాధించే మేటి జాతీయ ఆటగాడు సురజిత్. ఆయన ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారు. ఆయనకు నా నివాళి." అని మమత ట్వీట్ చేశారు.
కొవిడ్ పాజిటివ్గా తేలడంతో సురజిత్ జనవరి 23న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల గత వారం నుంచి వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడం వల్ల గురువారం తుది శ్వాస విడిచారు.
1951, ఆగస్టు 30న జన్మించిన సురజిత్ సేన్గుప్తా.. కిద్దెర్పోర్ క్లబ్లో తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత కోల్కతాలోని మూడు ప్రధాన క్లబ్లకు ప్రాతినిధ్యం వహించారు. మోహున్ బగన్, ఈస్ట్ బంగాల్, మహమ్మదన్ స్పోర్టింగ్ జట్లకు ఆడారు.
1970 ఏషియన్ గేమ్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించడంలో తన వంతు కృషి చేశారు సురజిత్. ఈస్ట్ బంగాల్ జట్టును సాటిలేని టీమ్గా తీర్చిదిద్దడంలో సురజిత్ కీలక పాత్ర పోషించారు. ఈస్ట్బంగాల్ జట్టు గోల్డెన్ ఎరాగాలో సురజిత్ భాగం. ఆ సమయంలో కోల్కతా ఫుట్బాల్ లీగ్లో (1970-1976) వరుస టైటిళ్లు, ఆరు సార్లు ఐఎఫ్ఏ షీల్డ్, మూడు సార్లు దురంద్ కప్ను గెలుచుకుంది.
ఇదీ చూడండి : చెలరేగిన నరైన్.. యూవీ ప్రపంచ రికార్డు జస్ట్ మిస్