ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్లో ఆడటం ప్రతి అథ్లెట్ కల. ఆ అవకాశం టోక్యో ఒలింపిక్స్తో దక్కించుకుంది 23ఏళ్ల యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్. అయితే పోటీలకు ముందు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడి కొంతకాలం పాటు శిక్షణకు దూరమైన ఆమె.. ఆత్మస్థైర్యంతో పోటీల్లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ఇప్పుడు సెమీస్లోకి అడుగుపెట్టింది. ఒలింపిక్స్ బాక్సింగ్లో సంచలనం సృష్టించిన లవ్లీనా.. అరంగేట్ర పోటీల్లోనే పతకాన్ని ముద్దాడబోతోంది..!
కిక్ బాక్సింగ్ నుంచి..
అస్సాంలోని గోలాఘాట్ జిల్లా బారో ముఖియా గ్రామంలో 1997 అక్టోబరు 2న జన్మించింది లవ్లీనా. తండ్రి చిరు వ్యాపారి. ఆమె కంటే పెద్దవారైన ఇద్దరు కవల సోదరీమణులు కిక్ బాక్సింగ్లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అక్కలను చూసి తన కూడా ముందు కిక్ బాక్సింగ్ను ఎంచుకుంది. జిల్లా స్థాయిలో పలు పోటీల్లో పాల్గొంది. ఒకరోజు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమె చదువుతున్న హైస్కూల్లో పోటీలు నిర్వహించింది. అందులో లవ్లీనా కూడా పోటీ చేసింది. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ కోచ్ పదుమ్ బోరో ఆమెను కిక్ బాక్సింగ్ నుంచి బాక్సింగ్కు పరిచయం చేశారు. అలా 2012 నుంచి ఆమె బాక్సింగ్లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది.

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్..
2017లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకోవడం వల్ల లవ్లీనా పేరు బాక్సింగ్ ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 2018లో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ ఏడాది దిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అరంగేట్రం చేసిన లవ్లీనా.. 69కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆ మరుసటి ఏడాదే రష్యాలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్లో మళ్లీ కాంస్యపతకం సాధించింది. అంతేగాక ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రెండు సార్లు కాంస్యాలు దక్కించుకుంది.
కరోనాను ఎదిరించి..
2020 మార్చిలో జరిగిన ఆసియా అండ్ ఓషినియా బాక్సింగ్ ఒలింపిక్ అర్హత టోర్నమెంట్లో గెలిచి టోక్యో ఒలింపిక్స్ 2020లో లవ్లీనా బెర్తు ఖరారు చేసుకుంది. గతేడాది జరగాల్సిన ఈ పోటీలు కరోనా కారణంగా ఏడాదిపాటు వాయిదా పడ్డాయి. అదే సమయంలో లవ్లీనా తల్లి మమోనీ బొర్గోహెన్కు కిడ్నీ మార్పిడి జరిగింది. దీంతో తల్లిని చూసేందుకు స్వస్థలానికి వెళ్లిన లవ్లీనాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒలింపిక్స్లో అర్హత సాధించిన 16 బాక్సర్లకు సాయ్ కేటాయించిన 56 రోజుల యూరప్ శిక్షణ టూర్కు ఆమె వెళ్లలేకపోయింది.
కరోనా సోకిన సమయంలో లవ్లీనా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. "కొవిడ్ బారిన పడిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డా. సాధన చేసేందుకు కూడా నా ఆరోగ్యం సహకరించలేదు. అయినా నేను కుంగిపోలేదు. సానుకూల దృక్పథంతో ఉన్నా. మెడిటేషన్ చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకున్నా. భవిష్యత్ అవకాశాలపై దృష్టిపెట్టా" అని ఒకానొక సమయంలో లవ్లీనా చెప్పింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వేగంగా శిక్షణ మొదలుపెట్టింది.
అరంగేట్రమే అయినా..
లవ్లీనా ఒలింపిక్స్లో ఆడటం ఇదే తొలిసారి. అయినా భయపడలేదు. అదిరిపోయే పంచులతో క్వార్టర్స్ వరకు చేరింది. క్వార్టర్స్లో మాజీ ప్రపంచ ఛాంపియన్, చైనీస్ తైపీ బాక్సర్ నిన్-చిన్తో తలపడింది. దూకుడు ప్రదర్శించకుండా తెలివిగా పంచ్లు విసురుతూ ప్రత్యర్థిని కట్టడి చేసింది. 4-1 స్కోరుతో ఘన విజయం సాధించి.. సెమీస్కు దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఆగస్టు 4వ తేదీన జరిగే సెమీస్లో నెగ్గితే రజతం లేదా స్వర్ణ పతకం సాధిస్తుంది. ఒకవేళ అక్కడ ఓడిపోయినా కనీసం కాంస్యం దక్కుతుంది.