భారత దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు భైచుంగ్ భుటియా పేరుతో సిక్కింలో ఓ స్టేడియం నిర్మితమైంది. 15వేల మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ మైదానాన్ని.. కరోనా పరిస్థితులు చక్కబడ్డిన తర్వాత ప్రారంభించనున్నారు. భుటియా పుట్టిన ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ స్టేడియంలో.. ఫ్లడ్లైట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. దేశంలో సాకర్ ఆటగాడి పేరుతో నిర్మించిన తొలి స్టేడియం ఇదే.
ఈ గౌరవం దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు భుటియా. భారత్ తరపున 100 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి ఫుట్బాల్ ప్లేయర్ ఇతడు.
"ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. చాలా ఉత్తేజంగానూ ఉంది. యువ ఫుట్బాల్ ఆటగాళ్లకు అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన మరో మైదానం అందుబాటులోకి వస్తుండడం చాలా ఆనందంగా ఉంది’’ అని భుటియా పేర్కొన్నాడు.
ఈ నూతన మైదానంలో ఓ ఫుట్బాల్ అకాడమీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించాడు భుటియా. అన్నీ సిద్ధమైతే ఇక్కడ గోల్డెన్ బేబీ లీగ్లను నిర్వహించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. 2010లో ఈ స్టేడియం పనులు ప్రారంభించారు.