టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, సాక్షిమాలిక్(Dhoni-Sakshi) దంపతుల వివాహ వార్షికోత్సం ఆదివారం(జులై 4). మూడేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా భార్యకు ఓ మధురమైన బహుమతిని ఇచ్చాడు మహీ.
మహీకి కార్లు, బైకులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేసిన అతడు.. వివాహ వార్షికోత్సం సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా ఓ వింటేజ్ కారును కానుకగా ఇచ్చాడు. లేత నీలం, తెలుపు రంగు కాంబినేషన్లో ఉన్న ఆ కారు.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను సాక్షి.. ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. దీంతోపాటే వీరిద్దరు కలిసి దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. వీరిద్దరికి కూతురు జీవా ఉంది. ప్రస్తుతం వీరి కుటుంబం విహారయాత్రలో ఎంజాయ్ చేస్తోంది.
అలా ప్రేమలో
ధోనీ, సాక్షి తండ్రులు ఇద్దరు ఒకేచోట కలిసి పనిచేసేవారు. అలా వీరిద్దరు కూడా ఒకేచోట కలిసి చదువుకున్నారు. అయితే మహీ మాత్రం సాక్షికి సీనియర్. కానీ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత సాక్షి తండ్రికి ఉద్యోగం బదిలీ అవ్వడం వల్ల వేరే చోటుకు తమ మకాం మార్చారు. దీంతో వీరు చాలా కాలం దూరంగానే ఉన్నారు.
2007లో అనుకోకుండా ఓ కామన్ స్నేహితుడి ద్వారా వీరిద్దరు మళ్లీ కలుసుకున్నారు. అప్పటికే మహీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అదే సమయంలో సాక్షి ఓ హోటల్లో ఇంటర్న్షిప్ చేస్తోంది. అనుకోకుండా ఓ రోజు మ్యాచ్లో భాగంగా అదే హోటల్లో బసకు దిగారు టీమ్ఇండియా ఆటగాళ్లు. అయితే సాక్షికి తెలియకుండా ఆ హోటల్ మేనేజర్ దగ్గర నుంచి ఆమె ఫోన్ నెంబరు తీసుకుని తనకు మెసేజ్లు చేయడం ప్రారంభించాడు ధోనీ. అలా క్రమక్రమంగా వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా వీరిద్దరు 2008లో ప్రేమలో పడ్డారు. అప్పటికే పలువురు బాలీవుడ్ భామలతో ధోనీకి అఫైర్స్ నడుస్తున్నట్లు చాలా పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ 2010లో జులై 4న సాక్షిని పెళ్లి చేసుకున్నాడు మహీ.
ఇదీ చూడండి: అలా ధోనీ, సాక్షి ప్రేమలో పడ్డారు