కశ్మీర్ ప్రీమియర్ లీగ్(కేపీఎల్)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. మరో మూడు రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, ఈ లీగ్ను గుర్తించొద్దని ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 6న ప్రారంభమయ్యే ఈ లీగ్లో షాహిద్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం లాంటి క్రికెటర్లు తమ జట్లకు నాయకత్వం వహించనున్నారు. అయితే, ఈ లీగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ముజఫరాబాద్లో జరగుతున్న నేపథ్యంలో దానికి బీసీసీఐ అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతంపై భారత్, పాక్ మధ్య ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ కారణంగానే 2013 నుంటి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు.
'బీసీసీఐ బెదిరిస్తోంది'
అయితే, కేపీఎల్లో పాల్గొనే విదేశీ క్రికెటర్లను బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించింది పీసీబీ. క్రికెట్ సంబంధిత వ్యవహారాల కోసం వారికి భారత్లో ప్రవేశం ఉండబోదని హెచ్చరించిందని చెబుతోంది. సౌతాఫ్రికా క్రికెటర్ హర్షెల్ గిబ్స్ కూడా బీసీసీఐపై విమర్శలు చేశాడు. అలాగే భారత్లో స్పోర్ట్స్ మీడియాలో పనిచేయాలనే కాంక్షతోనే ఇంగ్లాండ్ మాజీ సారథి మాంటీ పనేసర్ కేపీఎల్ నుంచి తప్పుకొన్నాడని వార్తలు వస్తున్నాయి.
జారుకున్న ఐసీసీ..
అయితే కేపీఎల్ అంతర్జాతీయ టోర్నీ కాదు కాబట్టి తమ పరిధిలోకి రాదని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇదీ చూడండి: స్టార్ ఆటగాళ్లను భయపెడుతున్న ఆ 'ఒక్కటి'!