Buchanan about Team India: టీమ్ఇండియా.. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీస్లు గెలుపొందడం ద్వారా కంగారూ ఆటగాళ్ల అహం దెబ్బతిందని అన్నాడు ఆ జట్టు మాజీ కోచ్ జాన్ బుచానన్. అలాగే జట్టులో తమ స్థానాలు కోల్పోతామనే భయం ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిలోనూ కలిగిందని తెలిపాడు. ఈ క్రమంలోనే వారు ఇప్పుడు బాగా ఆడాల్సిన సమయం వచ్చిందని తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికతో చెప్పాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ ఆసీస్ విజేతగా నిలిచిందని, అందుకు ప్రస్తుత కోచ్ జస్టిన్ లాంగర్ విశేషంగా కృషి చేశాడన్నాడు.
"లాంగర్ కష్ట సమయాల్లో ఆసీస్కు అండగా ఉన్నాడు. ఏ జట్టునైనా తిరిగి విజయపథంలో నడిపించడానికి సమయం పడుతుంది. ఇక గత నవంబర్లో ఆసీస్ ప్రపంచకప్ గెలిచాక అతడితో మాట్లాడాను. ఆ సమయంలో లాంగర్.. పొట్టి కప్ గెలవడం కన్నా.. ఆ మెగా ఈవెంట్కు జట్టును ఎలా తీర్చిదిద్దింది, ఎలాంటి ప్రణాళికలు రూపొందించాననే విషయాలు చెప్పడానికి ఆసక్తి కనబరిచాడు. అతడికి మాజీ సారథి టిమ్ పైన్ కూడా సహకరించాడు" అని బుచానన్ తెలిపాడు.
కాగా, ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే మూడు టెస్టులు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఆ జట్టు నాలుగో టెస్టును డ్రాగా ముగించింది. ఐదో టెస్టు మ్యాచ్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది.