టీ20ల్లో మొదటి పవర్ ప్లే చాలా ముఖ్యం. ఈ సమయంలో బౌండరీ వద్ద ఇద్దరు ఫీల్డర్లే ఉంటారు కాబట్టి బ్యాట్స్మెన్ ఎక్కువ పరుగులు రాబట్టేందుకు వీలవుతుంది. అందువల్ల ఈ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడానికి బౌలర్లు కాస్త కష్టపడాలి. అందుకే స్వింగ్, సీమ్ బౌలర్లకు బంతిని ఇచ్చేందుకు కెప్టెన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు సారథులు మాత్రం ప్రారంభ ఓవర్లను స్పిన్నర్లతో వేయించి సత్ఫలితాలను సాధించారు. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతన్న యూఏఈ పిచ్లు కాస్త స్పిన్కు అనుకూలంగా ఉండటం వల్ల మెరుగైన ఫలితాలే వచ్చాయి. అలా ఈ ఏడాది బౌలింగ్లో తీసుకున్న కొన్ని అనుహ్య నిర్ణయాలు ఇవే!
పవర్ ప్లేలో బుమ్రా
అక్టోబర్ 23న చెన్నై-ముంబయి మ్యాచ్లో బౌల్ట్ తొలి ఓవర్ వేశాడు. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించడం వల్ల రెండో ఓవర్ను బుమ్రాతో వేయించాడు తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్. అతడి నమ్మకాన్ని నిజం చేస్తూ అదే ఓవర్లో అంబటి రాయుడు వికెట్ తీశాడు జస్ప్రీత్. గత మ్యాచ్లను చూసుకుంటే రాయుడుకు ముంబయిపై మంచి రికార్డుంది. తొలుత రెండో ఓవర్ను కౌల్టర్ నైల్ లేదంటే స్పిన్నర్కు ఇవ్వాలని అనుకున్న పొలార్డ్.. పిచ్ పరిస్థితి బుమ్రాకు బంతి ఇవ్వాలని అనుకున్నాడు.
పవర్ప్లేలో మ్యాక్స్వెల్
పవర్ హిట్టర్గా గుర్తింపు తెచ్చుకున్న పంజాబ్ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్.. ఈ సీజన్లో బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. అయితే స్పిన్ బౌలింగ్ కూడా వేయగల ఇతడికి, పవర్ప్లేలో బంతిని అందిస్తున్నాడు కెప్టెన్ కేఎల్ రాహుల్. వికెట్లు తీయలేకపోతున్నా సరే పరుగులను బాగానే నియంత్రిస్తూ సారథి నమ్మకాన్ని నిలబెడుతున్నాడు.
అక్షర్ పటేల్తో ఓపెనింగ్
సెప్టెంబర్ 25న చెన్నైతో జరిగిన మ్యాచ్లో తనకు తొలి ఓవర్ ఇవ్వమని స్పిన్నర్ అక్షర్ పటేల్(దిల్లీ), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కోరాడు. అలా మొదటి ఓవర్లోనే వాట్సన్ను పెవిలియన్కు చేర్చాడు. పంజాబ్తో మ్యాచ్లోనూ మూడో ఓవర్ వేసిన అక్షర్.. కేఎల్ రాహుల్ వికెట్ దక్కించుకున్నాడు.
సిరాజ్ చేతికి కొత్త బంతి
బెంగళూరు జట్టులో చేరినప్పటి నుంచి మహ్మద్ సిరాజ్ చేతికి కొత్త బంతిని ఇవ్వలేదు సారథి కోహ్లీ. కానీ ఈ సీజన్లో కోల్కతాతో మ్యాచ్లో ఆశ్చర్యకరంగా సిరాజ్ చేతికి కొత్త బంతిని ఇచ్చాడు కోహ్లీ. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఏకంగా రెండు మెయిడిన్లు వేశాడు సిరాజ్. టోర్నీ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా నిలిచాడు. ఇదే మ్యాచ్లో మూడు వికెట్లు కూడా దక్కించుకున్నాడు.