ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓటమి చెందింది టీమ్ఇండియా. అయితే తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు సారథి కోహ్లీ మాత్రం పాయింట్లను పెంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 74 పరుగులు చేసిన కోహ్లీ రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుని రెండో స్థానాన్ని మరింత పదిలపర్చుకుని మొదటి స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్కు దగ్గరగా వెళ్లాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ కేవలం 1 పరుగుకే పరిమితమైన స్మిత్ 10 పాయింట్లను కోల్పోయాడు. ప్రస్తుతం కోహ్లీ 888, స్మిత్ 911 పాయింట్లతో కొనసాగుతున్నారు. అయితే మిగిలిన మూడు టెస్టుల్లో కోహ్లీ ఆడటం లేనందున స్మిత్ మరింతగా పాయింట్లను పెంచుకునే అవకాశం ఉంది.
తొలి టెస్టులో 47, 6 పరుగులు చేసిన లబుషేన్ కెరీర్లో అత్యుత్తమంగా 839 పాయింట్లను సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ మూడో ర్యాంకులో ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 43 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్లో డకౌటైన పుజారా ఓ స్థానాన్ని కోల్పోయి 8వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఏడో స్థానానికి ఎగబాకాడు.
బౌలర్ల విభాగంలో ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ మరిన్ని పాయింట్లను పెంచుకున్నాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్లను సాధించిన కమిన్స్ ప్రస్తుతం 910 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో రాణించిన హెజిల్వుడ్ నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అశ్విన్ ఒక స్థానం ఎగబాకి 9వ ర్యాంకులో నిలిచాడు.