ఈ ఐపీఎల్ 13వ సీజన్లో స్పిన్నర్లు రెచ్చిపోతారని, బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ క్రిస్ లిన్, పొలార్డ్, హార్దిక్ పాండ్య లాంటి వారికి అంత తేలిక కాదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఐపీఎల్ టోర్నీని యూఏఈకి తరలించిన నేపథ్యంలో అక్కడి పిచ్లు స్పిన్కు అనుకూలిస్తాయని చెప్పాడు. దాంతో స్పిన్ విభాగం గట్టిగా ఉన్న జట్లకు అది కలిసి వస్తుందని స్పష్టం చేశాడు.
"మంచి స్పిన్ బౌలింగ్ కలిగిన జట్లకు ఈ సీజన్ బాగా కలిసి వస్తుందని భావిస్తున్నా. అలాగే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ మాత్రం తేలిపోతారు. క్రిస్లిన్, పొలార్డ్ లాంటి ఆటగాళ్లు ఆడలేరు. హార్దిక్ పాండ్య స్పిన్ బౌలింగ్పై బాగా ఆడగలిగినా అంత తేలిక కాదు. ఈ సీజన్లో జట్ల ఎంపికలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి పెద్ద పరీక్ష ఎదురుకానుంది. వారి బౌలింగ్లో అనేక వేరియేషన్లు చూడాల్సి ఉంటుంది"
-రమీజ్ రాజా, పాకిస్థాన్ మాజీ ఆటగాడు
అనంతరం ప్రేక్షకులు లేకుండా ఈ టోర్నీని నిర్వహించడంపై స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితులు కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కష్టంగా ఉంటాయన్నాడు. ఆ రెండు జట్లకూ సొంత మైదానాల్లో విశేషమైన అభిమాన గణం ఉందని, వారి మద్దతుతో ఆయా జట్లు బాగా ఆడతాయని పాక్ మాజీ అన్నాడు. అలాగే బయోసెక్యూర్ విధానంలో ఆడటం కూడా అంత తేలిక కాదన్నాడు. అక్కడ మొత్తం ఖైదీలా ఉండాల్సిన పరిస్థితి అని, దాంతో పాటు ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరమని తెలిపాడు. అభిమానులు లేని ఐపీఎల్.. మెగా టోర్నీలా అనిపించదని రమిజ్ అభిప్రాయపడ్డాడు.