కరోనా ప్రభావంతో దేశం లాక్డౌన్లో ఉన్న కారణంగా ఐపీఎల్ నిర్వహణ సందేహంగా మారింది. ఈనెల 29 నుంచి ప్రారంభం కావాల్సిన టోర్నీ.. ఏప్రిల్ 15కు వాయిదా పడింది. కానీ అప్పుడూ జరుగుతుందా? లేదా? అనేది అనుమానమే. ఒకవేళ ఈ లీగ్ మొదలైతే ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్. ప్రస్తుతం ప్రాక్టీస్లో బిజీగా ఉన్నాడు. 2018లో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆ జట్టుకే ఆడుతున్నాడు.
ప్రస్తుతం భారత్లోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం లాక్డౌన్ గడువు ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జరపాలా? వద్దా? అనే విషయమై ఎటు తేల్చుకోలేకపోతుంది బీసీసీఐ. ఇలాంటి సమయంలో టోర్నీలో ఆడే విషయమై వెనక్కు తగ్గుతున్నారు పలువురు క్రికెటర్లు. ఇప్పటికే దీనిపై నిర్ణయాన్ని ఆటగాళ్లకే వదిలేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.