భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు విజయవంతం కావడానికి మాజీ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి వారే కారణమని పాకిస్థాన్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా యువకులపై దృష్టిసారించిందని, దాంతో వారు గాడిన పడేవరకూ సీనియర్లు సహకరించారని చెప్పాడు. ఆ తర్వాతే సీనియర్లు పక్కకు తప్పుకున్నారన్నాడు. తాజాగా అక్మల్ ఓ పాకిస్థాన్ వెబ్సైట్తో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించాడు.
ఈ లక్షణం పాకిస్థాన్ క్రికెట్లో కొరవడిందని.. షోయబ్ అక్తర్, మహ్మద్ యూసుఫ్, అబ్దుల్ రజాక్ లాంటి ఆటగాళ్లు మరింత కాలం ఆడాల్సి ఉన్నా.. ముందే రిటైర్మెంట్ ప్రకటించారని చెప్పాడు. వాళ్లు అలాగే కొనసాగి తమ జట్టులోనూ పలువురు యువకుల్ని మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. సీనియర్ బ్యాట్స్మన్ యూనిస్ఖాన్ తోనూ జట్టు సరిగ్గా వ్యవహరించలేదని, అతడిని దూరం పెట్టడం వల్ల తప్పుకున్నాడని అక్మల్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి ఆటగాళ్లంతా మరి కొన్నేళ్లు ఆడి ఉంటే పాకిస్థాన్ జట్టులో కొంత మంది స్టార్లు తయారయ్యే వారని చెప్పాడు. ఈ విషయంలో పాక్ జట్టు వ్యవహార శైలే బాగోలేదని, టీమ్ఇండియా సరైన ప్రణాళికతో ముందుకెళ్లిందని అక్మల్ అన్నాడు.