మెల్బోర్న్ టెస్టులో విజయంతో పుంజుకున్న టీమ్ఇండియాపై దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ప్రశంసలు కురిపించారు. శతకంతో జట్టు విజయానికి కారణమైన తాత్కాలిక సారథి రహానెతో పాటు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టిన భారత బౌలింగ్ లైనప్ను కొనియాడారు.
"ఫాస్ట్బౌలర్లకు అటాకింగ్ సారథిగా ఉన్న బుమ్రా ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు. పరిస్థితులు చేయిదాటినప్పుడల్లా అతడు మరింత కష్టపడ్డాడు. ఛాంపియన్ బౌలర్ లక్షణం అదే. ఓవర్లు వేసేకొద్దీ రాటుదేలిన సిరాజ్, తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నట్టు అనిపించలేదు. అతడు తన ప్రణాళికలను బాగా అమలు చేశాడు."
-సచిన్ తెందూల్కర్, మాజీ క్రికెటర్
బాక్సింగ్ డే టెస్టు తొలిఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో కీలకమైన స్టీవ్ స్మిత్ సహ మరో వికెట్ను బుమ్రా పడగొట్టాడు. రహానె.. తెలివిగా జట్టును నడిపించడమే కాకుండా బాధ్యతాయుతమైన బ్యాటింగ్తో భారత్ గెలుపును ఖాయం చేశాడని సచిన్ కొనియాడారు.
"రహానె అద్భుతంగా ఆడాడు. ప్రశాంతంగా, స్వీయనియంత్రణలో ఉన్నాడు. అతడికి దూకుడు ఉద్దేశం ఉన్నా నిశ్చలత్వంతో దానిని బ్యాలన్స్ చేశాడు. బౌండరీలకు అవకాశం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా ఆడాడు. అది మంచి ఆలోచన. జడేజా, రహానెల భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. వారి పరుగులు ప్రత్యర్థులను ఒత్తిడిలో పడేశాయి. పంత్ చేసిన పరుగులు కూడా టీమ్ఇండియాకు కలిసొచ్చాయి" అని సచిన్ తెలిపారు.
ఇదీ చూడండి: రహానె.. కెప్టెన్సీ కోసమే పుట్టాడు: చాపెల్