ఇండియన్ ప్రీమియర్ లీగ్లో జాతి వివక్షకు సంబంధించిన ఘటనలేవీ లేవని సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాళ్లు, అధికారులు స్పష్టం చేసిన.. కొద్ది గంటల్లోనే ఆసక్తికర అంశం బయటకువచ్చింది. వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామిని 'కాలూ' అని పిలిచింది ఇషాంత్ శర్మగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన అతడి ఓ ఇన్స్టా పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్గా మారింది.
![Proof Here: Darren Sammy really called 'kalu' by ishanth sharma during playing for Sunrisers Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7542578_ishanth.jpg)
ఇదీ జరిగింది..
సామి 2013, 2014 సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడాడు. ఆ సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరాను కొందరు 'కాలు' అని పిలిచారని ఆరోపించాడు. బలవంతుణ్ని అలా పిలుస్తారని అనుకున్నానని, రంగును చూసి పిలిచారని తెలిసి కోపం వస్తోందని పేర్కొన్నారు. జార్జి ఫ్లాయిడ్ ఘటన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. అయితే అతడి మాజీ సహచరులు పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, వేణుగోపాల్ రావు ఆ వ్యాఖ్యలను తిరస్కరించారు. జట్టు యాజమాన్యం సామి వ్యాఖ్యలు ఖండిస్తూ.. అలా జరిగుంటే అప్పుడే ఫిర్యాదు చేయాల్సిందని తెలిపింది.
ఆటగాళ్లు వినలేదన్నారు..!
సామి ఆరోపణల అనంతరం కొందరు క్రికెటర్లు స్పందించారు. "ఎవరైనా అలాంటి మాటలు ఉపయోగించడం నేనెప్పుడూ వినలేదు" అని పార్థివ్ పటేల్ అన్నాడు. "అలా జరిగినట్టు తెలియదు" అని వేణుగోపాల్ రావు తెలిపాడు. ఐపీఎల్లో జరగలేదు కానీ కొన్నిసార్లు దేశవాళీ క్రికెట్లో అలాంటి పదాలు ఉపయోగించడం విన్నానని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.
సామి వ్యాఖ్యల నేపథ్యంలో బీసీసీఐ కూడా స్పందించింది. "ఏమైనా ఫిర్యాదులు ఉంటే అప్పుడే చెప్పాల్సింది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఇప్పటికీ అధికారికంగా ఫిర్యాదు చేసి వివరాలు అందిస్తే బోర్డు విచారణ చేపడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇషాంత్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం అది పెద్ద అభ్యంతరకరమైన పదం కాదు స్నేహితులు అలా సరదాగా మాట్లాడుకుంటారని.. జంబూకు మద్దతుగా మాట్లాడుతున్నారు.