సొంతగడ్డపై క్రికెట్ ఆడేందుకు అన్ని దేశాలను ఆహ్వానిస్తోంది పాకిస్థాన్ క్రిెకెట్ బోర్డు (పీసీబీ). ఇప్పటికే పలు దేశాలను బతిమిలాడుకోగా... ఇటీవల శ్రీలంక దాయాది దేశంలో అడుగుపెట్టింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా అంగీకారం తెలిపినట్లు పీసీబీ సీఈవో వసీం ఖాన్ తెలిపాడు. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను పాక్లో ఆడేందుకు ఒప్పుకున్నట్లు తాజాగా వెల్లడించాడు. ఈ ఒప్పందం ప్రకారం 2022లో పాక్లో టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది ఆసీస్ జట్టు.
![pakistan vs australia: cricket australia agrees to send team to Pakistan for Test series in 2022](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5333334_wasim11.jpg)
" ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పాకిస్థాన్లో మూడు టెస్టులు ఆడేందుకు ఒప్పుకొంది. 2022లో మా గడ్డపై ఆసీస్.. మ్యాచ్లు ఆడేందుకు మేము ఎంతో శ్రమించాం."
-- వసీం ఖాన్, పీసీబీ సీఈవో
టెస్టు హోదా ఉన్న దేశాల్లో అందరూ ఏడాదికి 14 మ్యాచ్లు ఆడుతుంటే.. పాక్ మాత్రం ఆరు నుంచి ఏడు మాత్రమే ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు వసీం. దీనికి ప్రధాన కారణం తటస్థ వేదికలపై మ్యాచ్లు నిర్వహించడమేనని అభిప్రాయపడ్డాడు.1998 తర్వాత నుంచి ఇప్పటివరకు పాక్ గడ్డపై టెస్టులు ఆడలేదు కంగారూ జట్టు. ప్రస్తుతం శ్రీలంక, ఇంగ్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లోనే పాక్ తన మ్యాచ్లను నిర్వహించుకుంటోంది.
జనవరిలో బంగ్లాదేశ్నూ టెస్టు ఛాంపియన్షిప్లో మ్యాచ్లు ఆడాలని ఆహ్వానాన్ని పంపింది పాకిస్థాన్. అయితే ప్రస్తుతం ఈనెలలో శ్రీలంకతో టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఈ ఆటగాళ్లకు కల్పించిన భద్రతను పరిశీలించుకున్నాక బంగ్లా కూడా ఒప్పుకునే యోచనలో ఉన్నట్లు క్రీడావర్గాల సమాచారం. బంగ్లాదేశ్ 2008 నుంచి ఒక్కసారి దాయాది దేశంలో అడుగుపెట్టలేదు.
ఈ దేశాలతో పాటు అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా బోర్డులతోనూ సంప్రదింపులు జరుపుతోంది పాక్. వీలైతే ఈ దేశాలు 2020లోనే పాక్ గడ్డపై మ్యాచ్లు ఆడే అవకాశముంది.
మా పదవులు ఉత్తుత్తివే...
ఇటీవల ఆస్ట్రేలియాలో వసీం ఖాన్... షికార్లు కొట్టాడానికి వెళ్లాడని పాక్ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దానిపైనా వివరణ ఇచ్చాడు. ఫోన్లు, మెయిల్స్ ద్వారా అన్ని పనులు జరగవని.. ముఖ్యమైన కార్యక్రమాల కోసమే ఆస్ట్రేలియా వెళ్లినట్లు చెప్పాడు. అంతేకాకుండా పాకిస్థాన్ బోర్డులో అందరి పదవులు నామమాత్రమే అని చెప్పుకొచ్చాడు. ఆయన పదవే కాకుండా ప్రధాన కోచ్, ఛీఫ్ సెలక్టర్ మిస్బా ఉల్ హక్ పదవి కూడా స్వయంగా ఏ నిర్ణయం తీసుకోలేడని చెప్పాడు వసీం.