పలు నాటకీయ పరిణామాల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో అడుగుపెట్టింది. ఈ పర్యటనకు బయలుదేరే ముందు పాక్ ఆటగాళ్లకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పది మందికి పాజిటివ్గా తేలింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా నిర్వహించిన పరీక్షల్లో మహమ్మద్ హఫీజ్కు పాజిటివ్ వచ్చింది. అనుమానంతో అతడు ప్రైవేటులో పరీక్షించుకోగా నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్లో పేర్కొన్నాడు. దీనిపై పీసీబీ ఒకింత అసహనం వ్యక్తం చేసింది.
ఇవి చాలవన్నట్లు.. ఆదివారం పీసీబీ తన ట్వీట్లో దేశం పేరును తప్పుగా రాసి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. పాకిస్థాన్కు బదులుగా 'పాకియతాన్ జట్టు ఇంగ్లాండ్కు బయలుదేరింది. ఆల్ ది బెస్ట్ బాయ్స్' అని ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు 'పాకియతాన్' ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. పలు మీమ్స్ కూడా సృష్టిస్తున్నారు. ఓ గంట తర్వాత పీసీబీ తప్పును తెలుసుకొని సరిదిద్దుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
![Pakistan Cricket Board gets trolled on Twitter after misspelling Pakistan as Pakiatan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7827366_2.jpg)