న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్.. ఆరంభ మ్యాచ్లోనే అదరహో అనిపించింది. రెండొందల స్కోరును అలవోకగా ఛేదించి ఔరా అనిపించింది. స్వదేశంలో సాగించిన దూకుడును విదేశీ గడ్డపైనా చూపిస్తూ ఐదు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. నేడు రెండో టీ20 సందర్భంగా కివీస్తో మరోమారు సమరానికి సై అంటోంది మెన్ ఇన్ బ్లూ. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్లో మరింత ఆధిక్యం సాధించాలని టీమిండియా భావిస్తుండగా.. తొలి టీ20 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఇరుజట్లు ఎలాంటి ప్రణాళికలతో ముందుకొచ్చే అవకాశముందో ఒకసారి పరిశీలిస్తే..
బలంగా టాప్ ఆర్డర్...
టీమిండియా బ్యాట్స్మెన్ అంతా మంచి ఫామ్లో ఉన్నారు. రోహిత్ తొలి మ్యాచ్లో విఫలమైనా పెద్దగా చింతించాల్సిన పనిలేదు. మరోవైపు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే బ్యాట్ ఝుళిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి మ్యాచ్లో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (58) ఒత్తిడిని జయించి అద్భుతంగా ఆడాడు. అయ్యర్ గత సెప్టెంబర్ నుంచి మొత్తం 12 టీ20లు ఆడగా 34.14 సగటుతో రెండు అర్ధ శతకాలు సాధించాడు. ఫలితంగా టాప్-5 బ్యాట్స్మెన్తో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు.

సైనీ తుది జట్టులోకి ఖాయమా..?
సాధారణంగా టీమిండియా విన్నింగ్ కాంబినేషన్ను ఎప్పుడూ మార్చదు. అయితే తొలి టీ20లో జస్ప్రీత్ బుమ్రా(4 ఓవర్లలో 31 పరుగులు) ఒక్కడే చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. షమీ(4 ఓవర్లలో 53), శార్దూల్ ఠాకూర్(3 ఓవర్లలో 44)ను కివీస్ ఆటగాళ్లు దంచికొట్టారు. అయితే యార్కర్లు వేయగలిగే సత్తా ఉన్న నవ్దీప్ సైనీని ఠాకూర్ స్థానంలో ఈ మ్యాచ్కు తీసుకునే అవకాశం ఉంది. జడేజాతో పాటు చాహల్/కుల్దీప్లలో ఒకరు, ఆల్రౌండర్గా శివమ్ దూబె రంగంలోకి దిగనున్నారు.

కివీస్ మార్పులకు నో..!
తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ బాగా ఆడినా.. ఆ జట్టు చేయాల్సిన స్కోరు కన్నా సుమారు 20 పరుగులు తక్కువే చేసింది. ఓపెనర్లు కొలిన్ మన్రో, మార్టిన్ గప్తిల్ శుభారంభం చేయగా కెప్టెన్ విలియమ్సన్, సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ అద్భుతంగా ఆడారు. ఫలితంగా కివీస్ జట్టు బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగానే ఉంది.
ఆల్రౌండర్లు స్కాట్ కగ్గిలిన్, డారిల్ మిచెల్కు అవకాశం రాకపోవచ్చు. మిడిల్ ఆర్డర్లో టిమ్ సీఫెర్ట్, కొలిన్ డి గ్రాండ్హోమ్ మెరుగవ్వాలి. వీళ్లు గనుక చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. బౌలింగ్ విభాగంలో టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్, బ్లెయిర్ టిక్నర్ కాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
భారత్ తుది జట్టు (అంచనా):
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్శర్మ, కేఎల్ రాహుల్(కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్/ చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ/శార్దూల్ ఠాకూర్
కివీస్ తుది జట్టు (అంచనా):
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, కొలిన్ డీ గ్రాండ్హోమ్, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ.