డీఆర్ఎస్లో 'అంపైర్ కాల్' విధానంపై వ్యతిరేకత పెరుగుతోంది. బాక్సింగ్ డే టెస్టులో అంపైర్ కాల్తో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తప్పించుకున్న సంగతి తెలిసిందే. కాగా, మంచి బంతులు వేసినా ఔట్ చేసే అవకాశాల్ని టీమ్ఇండియా కోల్పోవడం వల్ల.. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అంపైర్ కాల్ నిబంధనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సమీక్ష నిబంధనలపై ఐసీసీ పునరాలోచించాలని కోరాడు. తాజాగా మాజీ అంపైర్ డారెల్ హార్పర్ కూడా అంపైర్ కాల్ను తీవ్రంగా తప్పుపట్టాడు. సమీక్షలో దాన్ని నిషేధించాలని అన్నాడు.
"అంపైర్ కాల్పై పూర్తి అవగాహన ఉంది. దాన్ని ఐసీసీ నిషేధించి వివాదాల నుంచి తప్పుకోవాలి. స్టంప్కు తగిలిన ఏ బంతి అయినా బెయిల్స్ను పడగొడుతుంది. గత 12 ఏళ్లుగా ఆటగాళ్లు, అభిమానులకు ఎల్బీ రివ్యూపై గందరగోళ పరిస్థితి ఉంది. సాంకేతిక, అవగాహనలో లోపాలున్నాయని ఇది ఎత్తిచూపుతోంది. అయితే దీనిపై ఐసీసీ దృష్టిసారించి తగిన నిర్ణయాన్ని తీసుకోవాలి"
-డారెల్ హార్పర్, మాజీ అంపైర్
కాగా, అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి చెందితే 15 సెకన్ల లోపు ఆటగాడు/జట్టు సమీక్షకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఎల్బీడబ్ల్యూపై వెళ్లిన సమీక్షల్లో వచ్చే ఫలితాలపై ఆటగాళ్లు, మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీప్లేలో థర్డ్ అంపైర్.. పిచ్చింగ్, ఇంపాక్ట్ లైన్, హిట్టింగ్ అనే మూడు అంశాలను పరిశీలించి ఎల్బీపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంటారు.
తొలుత థర్డ్ అంపైర్ బంతి బ్యాట్కు తాకలేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత, సరైన లైన్లో బాల్ పడిందా లేదా అనే అంశాన్ని గమనిస్తారు. అనంతరం బంతి వికెట్లను తాకుతూ వెళ్తుందా లేదా అనేది చూస్తారు. ఈ క్రమంలోనే సగం కన్నా ఎక్కువ మొత్తంలో బంతి వికెట్లను తాకనట్లు ఉంటే 'అంపైర్ కాల్' నిర్ణయంతో థర్డ్అంపైర్ అంతిమ నిర్ణయాన్ని వెల్లడిస్తుంటారు. అంటే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటిస్తే.. సమీక్షలో కూడా థర్డ్అంపైర్ నాటౌట్ అని వెల్లడిస్తాడు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ అంటే ఆ నిర్ణయాన్ని ఏకీభవిస్తాడు.