ఇషాన్ కిషన్ మెరుపులు, విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్తో.. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అరంగేట్రంలోనే అర్థశతకం(56) సాధించిన ఇషాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
ఇషాన్- కోహ్లీ 'షో'
165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియాకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. సామ్ కరన్ వేసిన తొలి ఓవర్లే.. కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఓపెనర్ కేఎల్ రాహుల్(0). అప్పటికి భారత్ కూడా ఇంకా ఖాతా తెరవలేదు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(73*)తో ఇషాన్ కిషన్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అడుతున్నది తొలి మ్యాచ్ అన్న భయమే లేకుండా.. స్వేచ్ఛగా షాట్లు ఆడి.. ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.
ఈ మ్యాచ్తో కోహ్లీ కూడా ఫామ్ అందుకున్నాడు. చక్కటి డ్రైవ్స్తో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా.. కళ్లు చెదిరే స్ట్రైయిట్ డ్రైవ్ సిక్స్తో అర్థశతకాన్ని అందుకున్న తీరు అద్భుతం. ఆ తర్వాత కోహ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి పనిని ముగించాడు.
56 పరుగులు చేసిన ఇషాన్.. అదిల్ రషీద్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ కూడా ఎక్కడా ఆగలేదు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కానీ జోరును కొనసాగించలేక.. 26(13బంతులు) పరుగుల వద్ద జార్డన్ బౌలింగ్లో వెనుదిరిగాడు.
ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి కోహ్లీ... భారత్కు విజయాన్ని అందించాడు.
అంతకు ముందు.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన మోర్గాన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. జేసన్ రాయ్ టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1తో భారత్ సమం చేసింది.
ఇదీ చూడండి: చరిత్ర సృష్టించిన 'ఫెన్సర్' భవానీ- ఒలింపిక్స్కు అర్హత