చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 161 (231 బంతుల్లో 18ఫోర్లు, 2సిక్సులు), అజింక్య రహానె 67 (9ఫోర్లు) మెరిశారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 162 పరుగులు జోడించారు. క్రీజులో రిషభ్ పంత్( 33), అక్షర్ పటేల్(5) ఉన్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మొయిన్ అలీ, జాక్ లీచ్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. ఓలీ స్టోన్, కెప్టెన్ రూట్ తలో వికెట్ తీశారు.
0-1తో మొదలు..
చెపాక్ పిచ్పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆశించినంత శుభారంభం దక్కలేదు. స్కోరుబోర్డుపై పరుగులేమీ లేకుండానే డకౌట్గా తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు శుభ్మన్ గిల్. ఆ తర్వాత వచ్చిన పుజారాతో కలిసి.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 85 పరుగులు జోడించాడు. ఈ జోడీ కుదురుకుంటున్న క్రమంలో.. జాక్ లీచ్ బౌలింగ్లో పుజారా(21) క్యాచ్ ఔటయ్యాడు. ఈ సమయంలో భారీ అంచనాలతో క్రీజులోకి అడుగుపెట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) పూర్తిగా నిరాశపరిచాడు. స్పిన్నర్ మొయిన్ అలీ అతడ్ని బౌల్డ్ చేశాడు. ఓ స్పిన్నర్ బౌలింగ్లో కోహ్లీ పరుగులేమీ చేయకుండా ఔటవ్వడం ఇదే తొలిసారి. దీంతో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులతో లంచ్కు వెళ్లింది టీమ్ఇండియా.
రెండో సెషన్లో ఆచితూచి..
విరామం అనంతరం.. భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. భారీ షాట్లతో అలరించిన హిట్మ్యాన్ సుదీర్ఘ ఫార్మాట్లో ఏడో శతకాన్ని నమోదు చేశాడు. రహానె కూడా నిలకడగా ఆడటంతో వికెట్లేమీ నష్టపోకుండా రెండో సెషన్ను ముగించింది భారత్.
చివర్లో ఇంగ్లండ్ ఆధిపత్యం..
ఇక మూడో సెషన్లో ఓ వైపు రోహిత్, మరోవైపు అజింక్య కాస్త దూకుడు పెంచారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో రన్రేట్ బాగా పెరిగింది. ఈ క్రమంలో 150 పరుగులు చేసి.. ద్విశతకం దిశగా సాగుతున్న హిట్మ్యాన్ ఓ షాట్ ఆడబోయి జాక్లీచ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 162 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. నిలకడగా ఆడుతున్న రహానె కూడా మొయిన్ అలీ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్(13) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో ఈ సెషన్లో ఇంగ్లాండ్ ఆధిపత్యం కనబర్చినట్లైంది. ఈ క్రమంలో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన పంత్, అక్షర్ పటేల్ జోడీ.. స్కోరును 300 దాటించింది.
ఇదీ చదవండి: 'రెండో టెస్టులో 300 చేసినా చెపాక్లో 500తో సమానం'