నిర్ణయ సమీక్షా విధానంలో 'అంపైర్స్ కాల్' భాగంగానే ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. 'అంపైర్స్ కాల్' విషయంలో గందరగోళం ఉందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ వివాదాస్పద నిబంధనపై చర్చించింది. ప్రస్తుత నిబంధన ప్రకారం అంపైర్ నాటౌట్గా ప్రకటించిన ఎల్బీడబ్ల్యూ నిర్ణయాన్ని సవరించి ఔట్గా ప్రకటించాలంటే.. ఏదైనా స్టంప్ను బంతి 50 కంటే ఎక్కువ శాతం తాకాలి. బంతిలో కొద్ది భాగం స్టంప్స్కు తాకినా ఔట్గా ప్రకటించాలనేది కోహ్లి వాదన. అయితే అందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ.. నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్ఎస్), మూడో అంపైర్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఐసీసీ సీనియర్ టోర్నీల్లో తలపడే జట్లు ఏడుగురు సభ్యులను అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది.
ఐసీసీ నిర్ణయాలు..
- సమీక్ష ద్వారా ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు పరిశీలించేటప్పుడు వికెట్ ప్రాంతం ఎత్తును పెంచారు. ఇప్పటిదాకా బెయిల్స్ కింద వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు బెయిల్స్ పైభాగం వరకు ఎత్తును లెక్కలోకి తీసుకోనున్నారు.
- బ్యాట్స్మన్ పరుగును పూర్తి చేశాడా లేదా అన్నది మూడో అంపైర్ పరిశీలిస్తాడు. షార్ట్ రన్ చేసివుంటే తర్వాతి బంతి వేసేలోపు ప్రకటిస్తాడు.
- అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లే జట్లు అదనంగా ఏడుగురు ఆటగాళ్లు లేదా సిబ్బందిని తీసుకెళ్లవచ్చు. దీని కారణంగా జూన్లో ఇంగ్లాండ్లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు భారత్కు 30 మంది బృందాన్ని పంపే అవకాశం రానుంది.
- మహిళల వన్డే క్రికెట్లో బ్యాటింగ్ పవర్ ప్లేను తొలగించారు. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం రాబడతారు.
- ఐసీసీలోని శాశ్వత సభ్య దేశాల మహిళల జట్లకు టెస్టు, వన్డే హోదాను ఇస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.
ఇదీ చదవండి: పదేళ్ల క్రితం ఇదే రోజు విశ్వవిజేతగా భారత్