దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో భారత బ్యాటింగ్ సంచలనం యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన బ్యాటింగ్ విన్యాసాలతో రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్పై ఫైనల్ మ్యాచ్లో జైస్వాల్ 88(121 బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులతో చెలరేగాడు. అయినా.. చివరి మ్యాచ్లో తనకేదో అసంతృప్తి మిగిలిందని చెప్పాడు.
"అవసరం లేని సమయంలో ఒక చెత్త షాట్ ఆడాను. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వేగంతో బంతి వచ్చింది. ఈ ఓటమిని అందరూ అంగీకరించారు. ఆటలో గెలుపోటములు సహజం. ఒకవేళ టాస్ మేము గెలిచి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేది. ఫైనల్ మ్యాచ్ అనంతరం బంగ్లా ఆటగాళ్లు వికృత చేష్టలు చేశారు. కొందరు ప్రియమ్ గార్గ్ను రెచ్చగొట్టారు. అయితే ఈ మ్యాచ్ను గెలవాలని దేవుడిని ప్రార్థించిన వారిలో నేను ఒకడిని."
- యశస్వి జైస్వాల్, అండర్-19 టీమిండియా ఆటగాడు
బంగ్లాదేశ్పై ఫైనల్ మ్యాచ్కు ముందు విదర్భ రంజీ ట్రోఫీ జట్టుకు చెందిన వసీం జాఫర్ సలహాలను స్వీకరించానని తెలిపాడు జైస్వాల్.
రికార్డుల జైస్వాల్..
400 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు అండర్19 ప్రపంచకప్లో వరుసగా ఐదు అర్ధశతకాలు బాదిన మూడో బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. అదే విధంగా టోర్నీలో 10 సిక్సులుతో ప్రపంచకప్లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు.
రూ. 2.4 కోట్లకు వేలం..
యశస్వి జైస్వాల్.. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2 కోట్ల 40 లక్షల రూపాయలను వెచ్చించి ఆ జట్టు ఈ యువ ఆటగాడిని కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి.. 'కెప్టెన్కు తెలియకుండా పోస్ట్లు ఎలా తొలగిస్తారు'