కరోనా పరిస్థితుల కారణంగా నాలుగు నెలలుగా ఆటకు దూరమైనా మళ్లీ టీ20 క్రికెట్ లీగ్తో ముందుకు సాగడం శుభపరిణామని మహిళా టీమ్ఇండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. లాక్డౌన్తో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడి.. ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. యూఏఈలోని మూడు వేదికల్లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నవంబర్ 1 నుంచి 10 మధ్యలో మహిళల మ్యాచ్లు కూడా నిర్వహించాలని నిర్ణయించుకొంది. దాన్ని మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్ స్వాగతించారు. అయితే, అదే సమయంలో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ కూడా ఉండడం వ్ల పలువురు క్రీడాకారిణులు బీసీసీఐపై విమర్శలు చేశారు. దాంతో టీమ్ఇండియా కెప్టెన్లు వారి మాటలను తోసిపుచ్చారు.
భారత్లో మహిళల క్రికెట్కు ఈమధ్యే ఆదరణ పెరిగిందని, దాంతో ఐపీఎల్ ద్వారా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హర్మన్ తెలిపింది. ఈ విషయంలో బీసీసీఐ తమకు వెన్నుదన్నుగా నిలిచిందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ క్రికెట్ను గాడినపెట్టాలంటే ఈ టోర్నీ ఎంతో అవసరమని వెల్లడించింది. అలాగే కొద్ది నెలల క్రితం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరిన విషయంపై స్పందించింది హర్మన్. అది తమ అభిమానులు కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని, ప్రస్తుత పరిస్థితుల్లో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగడం ఎంతో ముఖ్యమని వివరించింది.
గత ఫిబ్రవరి, మార్చిలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన మహిళల పొట్టి ప్రపంచకప్లో హర్మన్ నేతృత్వంలోనే టీమ్ఇండియా చెలరేగి ఆడింది. ఫైనల్లోనూ మంచి ప్రదర్శన చేసి కప్పు గెలుస్తుందని ఆశించినా చివరికి ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్కు విశేషమైన స్పందన లభించింది.