దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్ జమాన్(193) వివాదాస్పద రనౌట్ విషయంలో క్వింటన్ డికాక్ మోసం చేశాడని తాను అననని.. కానీ అతడలా చేయాల్సింది కాదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. తొలుత ఈ విషయంపై మ్యాచ్ అనంతరం ట్వీట్ చేసిన అక్తర్.. జమాన్ అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. అలాగే అతడు ద్విశతకానికి అర్హుడని కొనియాడాడు. అయితే.. డికాక్ క్రికెట్ స్ఫూర్తిని మరిచి జమాన్ ఔటయ్యేలా చేశాడని మండిపడ్డాడు.
స్ఫూర్తికి లోబడి లేదు..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అక్తర్.. 'డికాక్ చేసిందాన్ని నేను మోసం అని పిలవను. కానీ అది క్రీడాస్ఫూర్తికి లోబడి లేదు. ఈ రనౌట్ విషయంలో అదే నాకు నచ్చలేదు. డికాక్ చాలా గొప్ప ఆటగాడు. అతడు కచ్చితంగా ఇలా చేయాల్సింది కాదు. జమాన్ రెండో పరుగు కోసం పరుగెత్తినప్పుడు ఫీల్డర్ బంతిని నాన్స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరి ఉంటాడని అనుకున్నాడు. అప్పుడే డికాక్ కూడా చేయిపైకెత్తిన సైగలు చేశాడు' అని అన్నాడు.
అది నచ్చలేదు..
ఫకర్ 193 పరుగుల వద్ద ఔటవ్వడం తనకు నచ్చలేదని, ఎందుకంటే పాకిస్థాన్ తరఫున అతడు రెండు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్ అవ్వాలని భావించానని మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు. ఆ రనౌట్ విషయంలో అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని దక్షిణాఫ్రికాకు పెనాల్టీ పరుగులు వేసుంటే పాక్ గెలిచేదని అన్నాడు. ఈ విషయం తనని తీవ్రంగా కలచివేసిందని తెలిపాడు. అలాగే మ్యాచ్ రీఫరీ అక్కడ ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నప్పుడు, పదే పదే రీప్లేలు చూస్తూ.. వెంటనే తగిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని అక్తర్ ప్రశ్నించాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్: ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన జట్లెన్నో..