ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్.. 2015 సీజన్లో జరిగిన విషాద సంఘటనను గుర్తుచేసుకున్నాడు. తాను కొట్టిన సిక్స్ వల్ల భారత్లోని ఓ పోలీస్ అధికారి ఓ కన్నుకు దెబ్బ తగిలి, చూపు కోల్పోయాడని అన్నాడు. ఈ ఘటన కింగ్స్ ఎలెవన్ పంజాబ్-కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ సందర్భంగా జరిగింది.
అదే సీజన్లో కొన్ని మ్యాచ్ల తర్వాత కూడా మిల్లర్ కొట్టిన మరో సిక్స్.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన సిద్ధార్థ్ అనే పిల్లాడి ఛాతీపై బలంగా తగిలింది. వెంటనే ఆ చిన్నారి సృహ తప్పిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా కోలుకున్నాడు. మీడియా, వార్త పత్రికల ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నానని మిల్లర్ చెప్పాడు.
"నేను కొట్టిన సిక్స్ వల్ల పోలీస్ అధికారి ఓ కంటికి గాయమైంది. అది చూసి చూపు కోల్పోయాడనుకుంటాను. ఈ విషయం మీడియా, వార్తాపత్రికల ద్వారా తెలిసింది. అయితే ఈ సీజన్లో మాత్రం ప్రేక్షకులు ఎవరూ ఉండరు కాబట్టి, అలాంటి సంఘటనలు ఏం జరగవు. వాళ్లు లేకుండా ఆడాలన్నా చాలా కష్టమే. చూద్దాం ఏం జరుగుతుందో?" -డేవిడ్ మిల్లర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్
ప్రస్తుత సీజన్ భారత్ బదులు దుబాయ్లో నిర్వహించడం సహా జనాలు లేకుండానే మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్.. నవంబర్ 10 జరిగే ఫైనల్తో ముగుస్తుంది. గత సీజన్లో పంజాబ్కు ఆడిన మిల్లర్.. ఈసారి రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.