టీమిండియా సెలక్టర్ల ఎంపిక ప్రక్రియపై నేడు క్రికెట్ సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో సెలక్టర్ల జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే 44 దరఖాస్తులు రాగా అందులోంచి ప్రధాన సెలక్టర్తో సహా ఓ సెలక్టర్ ఎంపిక ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా వైరస్ కారణంగా దుబాయ్లో జరిగే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పాల్గొనట్లేదు. దీంతో మంగళవారం జరిగే సీఏసీ మీటింగ్కు దాదా హాజరయ్యే అవకాశం ఉంది.
ఇటీవల భారత మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, మదన్ లాల్, సులక్షణ నాయక్ సీఏసీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. జాతీయ సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యత వీరిదే. పదవీ కాలం ముగిసిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడా స్థానాలను వీరు భర్తీ చేస్తారు. మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, నయన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అభయ్ కురువిల్లా సెలక్టర్ల రేసులో పోటీపడుతున్నారు. వీరిలో వెంకటేశ్ ప్రసాద్ (33 టెస్టులు), అగార్కర్ (26 టెస్టులు)కు టెస్టులు ఎక్కువ ఆడిన అనుభవం ఉంది.